దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
.jpeg)
మినిమం రూ.100 ఉంటేనే సర్వీసు ఇస్తున్న కేంద్రాలు
కొరవడిన ఐటీ శాఖ పర్యవేక్షణ
సంక్షేమ పథకాలకు భారీగా వసూల్
ప్రజల అవసరాలను ఆసరాగా మీసేవ నిర్వహకుల దోపిడీ
సాయిసూర్య-తెలంగాణ డెస్క్:మీ సేవ కేంద్రాలు దోపిడీకి తెరలేపాయి. ప్రజల అవసరాలను తీర్చాల్సి మీ సేవలు...ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మీ సేవ కేంద్రాలు అంటే...మీ సేవలో ఉంటాయని...కానీ మీమ్మల్సి దోచుకుంటామనేలా తయారయ్యాయి.
ప్రజల అవసరాలను ఆసరగా చేసుకుని కొందరు నిర్వాహకులు ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్న, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మీసేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇదే అదనుగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులోని ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో నకిలీ బర్త్ డే సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారుల తూతూ మంత్ర చర్యలతో మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని డబ్బులు దండుకుంటున్నారు.
మీ సేవలో ఏదైనా సర్వీస్ కావాలంటే...చార్జీలు వసూలు చేస్తారు. మినిమం ఛార్జీలు చెల్లించడానికి అవకాశం ఉంది. రేషన్ కార్డు దరఖాస్తుకు చేసుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ కేవలం రూ.45, కానీ మీ సేవ నిర్వాహకులు రూ.250 పైగానే వసూలు చేస్తున్నారు. వాట్సప్ లో ఉన్న పిడిఎఫ్ ఫైల్ ప్రింట్ తీసుకుంటే కూడా రూ.150 పైగా తీసుకుంటున్నారు. ఓ బాధితుడు నార్సింగ్ లోని ఓ మీ సేవ కేంద్రానికి వెళ్లి ఓటరు ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, సెంటర్ నిర్వాహకుడు రూ.250 వసూలు చేశాడు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోగా రూ.200 తీసుకున్నాడు. అఫిడవిట్చేసి ఇస్తామని మరో రూ.800 వసూలు చేశారు. ఇలా ప్రతి చిన్న అప్లికేషన్ కు నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు.
తాజాగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కార్డులో ఉన్న వారి పేర్లను తొలగించడం, కొత్త వాళ్ల పేర్లను చేర్చుకొనే దరఖాస్తుల ప్రక్రియ మీసేవ కేంద్రాలకు ద్వారా చేసుకోవాలి. ఈ దరఖాస్తుల విషయంలో నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలకు గత్యంతరం లేక, కార్డు కావాలనే ఆశతో ఎంతైనా భరిస్తూ దరఖాస్తు చేస్తున్నారు. ఇక నిరంతరం సాగే కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు, బర్త్ డే సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం అర్జీదారులను నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో మీ సేవా కేంద్రాల యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. మీ సేవ కేంద్రాలపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వసూలు చేస్తున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇకనైనా తరచూ తనిఖీలు చేసి సామాన్యులకు అందే ప్రభుత్వ సేవలను పటిష్టవంతంగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
About The Author
